రాష్ట్రంలో కోవిడ్–19 (కరోనా వైరస్) విస్తరించకుండా మరింత పటిష్టంగా లాక్డౌన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పొలం పనుల సీజన్ నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు, ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటూ వారిని మధ్యాహ్నం వరకు పనులకు అనుమతించాలని ఆదేశించారు. కరోనా వైరస్ విస్తరణ నివారణ చర్యలతోపాటు నిత్యావసరాలు, పేదలకు రేషన్ పంపిణీ, ఆక్వా, పంటలకు గిట్టుబాటు ధరలు, వలస కూలీలు, కార్మికులకు వసతి, భోజన సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాధ్, మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ ఇందులో పాల్గొన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
► వలస కూలీలు, కార్మికులకు షెల్టర్లలో మెనూ ప్రకారం భోజనం అందించాలి. సరుకు రవాణా, అత్యవసర సేవలకు ఇబ్బందులు తలెత్తకూడదు.
► జిల్లాల్లో మంత్రి ఆధ్వర్యంలో కోవిడ్ నివారణ చర్యలు చేపట్టాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారులు సమావేశాలు నిర్వహించి కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలి.