తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం (03.03.2026) ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను అత్యంత సమర్థవంతంగా నిర్వహించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం అన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్ రంగ ఉన్నతాధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
ఈ అద్భుత విజయం తెలంగాణ ఆర్థిక వృద్ధికి, కార్యనిర్వహణ సామర్థ్యానికి నిదర్శనమని భట్టి విక్రమార్క కొనియాడారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయినప్పటికీ పెద్ద రాష్ట్రాల గరిష్ట లోడ్లను అధిగమించే స్థాయికి చేరుకోవడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభివృద్ధిలో రాష్ట్రం సాధిస్తున్న వేగవంతమైన వృద్ధిని ఈ మైలురాయి స్పష్టం చేస్తోంది. ఐటీ, ఔషధ తయారీ, సాగునీటి ప్రాజెక్టుల విస్తరణ వంటి కారణాల వల్ల విద్యుత్ వినియోగ సాంద్రత గణనీయంగా పెరిగింది.
జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభను విశ్లేషిస్తూ.. మన రాష్ట్రం సుమారు 19,900 మెగావాట్ల డిమాండ్ ఉన్న మధ్యప్రదేశ్.. 20,600 మెగావాట్లు ఉన్న రాజస్థాన్ వంటి అతిపెద్ద రాష్ట్రాలతో సమానంగా నిలిచింది. పారిశ్రామిక రాష్ట్రాలైన పంజాబ్.. హర్యానా.. ఝార్ఖండ్.. ఛత్తీస్గఢ్ కంటే ఎక్కువ విద్యుత్ డిమాండ్ను తెలంగాణ నమోదు చేయడం విశేషం. గడిచిన మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే డిమాండ్ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2023-24లో 15,623 మెగావాట్లు ఉండగా.. ఇప్పుడు 18,139 మెగావాట్లకు చేరుకోవడం ద్వారా కొత్త గరిష్ట దశలోకి రాష్ట్రం ప్రవేశించింది.
రాబోయే వేసవి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. బలమైన గ్రిడ్ వ్యవస్థ.. సమన్వయంతో కూడిన యంత్రాంగం మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ స్థాయి నుండి ఫీల్డ్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే నాణ్యమైన విద్యుత్ సరఫరా సాధ్యమవుతోందని ఆయన ప్రశంసించారు. తెలంగాణ విద్యుత్ రంగం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రకటనలో స్పష్టం చేశారు.