తిరుమల లడ్డూ తయారీ కోసం వాడే నెయ్యి సరఫరాలో హెరిటేజ్ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. వైకాపా నాయకులు రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హెరిటేజ్ సంస్థ ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ తిరుమల దేవస్థానానికి ఎప్పుడూ నెయ్యిని సరఫరా చేయలేదని, ఇది ‘నిప్పులాంటి నిజం’ అని ఆయన నొక్కి చెప్పారు.
ముఖ్యంగా శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రదర్శించిన తీరుపై బీఆర్ నాయుడు సెటైర్లు వేశారు. “వైసీపీ నేతలకు నెయ్యికి, చీజ్కి తేడా తెలియదు” అని ఆయన ఎద్దేవా చేశారు. హెరిటేజ్ సంస్థకు చెందిన చీజ్ (Cheese) ప్యాకెట్ను చేత్తో పట్టుకుని, అది నెయ్యి అని సభలో చూపించడం ద్వారా వైకాపా తన స్థాయిని దిగజార్చుకుందని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని ఆయన హితవు పలికారు.
స్వామివారి అన్నప్రసాదాల నాణ్యత విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని ఛైర్మన్ వివరించారు. ఓపెన్ టెండర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా నెయ్యి కొనుగోళ్లు జరుగుతున్నాయని, గతంలో లాగా తక్కువ ధరలకు నాణ్యత లేని వస్తువులను కొనే సంస్కృతికి స్వస్తి పలికామని చెప్పారు. దేవుడి సొమ్మును భక్తులకు నాణ్యమైన ప్రసాదాలు అందించడానికే ఖర్చు చేస్తున్నామని, ఖర్చు కంటే భక్తుల సెంటిమెంట్లే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.