ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలకు సమయం దగ్గర పడింది. మార్చి 16, 2026 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో హాల్టికెట్లను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మార్చి 16న తెలుగు పరీక్షతో ప్రారంభమై, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ఈ షెడ్యూల్ ముగియనుంది.
హాల్టికెట్లపై విద్యార్థుల పేరు, తండ్రి పేరు లేదా పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే ఆందోళన చెందవద్దని విద్యాశాఖ భరోసా ఇచ్చింది. అటువంటి పొరపాట్లను సవరించుకునేందుకు తగిన అవకాశం కల్పిస్తామని, ఒకవేళ పరీక్షల సమయంలో కుదరకపోయినా.. ఫలితాల అనంతరం మార్క్స్ మెమో ఇచ్చేటప్పుడైనా సవరణలు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు టెన్షన్ పడకుండా పరీక్షలపై దృష్టి సారించాలని కోరారు.
పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం (Evaluation) ప్రక్రియపై కూడా స్పష్టతనిచ్చారు. ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 13 వరకు సుమారు 10 రోజుల పాటు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది.