కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. ‘లాక్డౌన్ సమయంలో ప్రీపెయిడ్ యూజర్లంతా నిరంతరాయంగా సర్వీసులు పొందేందుకు… వ్యాలిడిటీని పొడిగించడం సహా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. టెలికమ్యూనికేషన్ సేవలను నిత్యావసర సర్వీసుల కింద పరిగణించి, మినహాయింపు ఇచ్చినప్పటికీ.. లాక్డౌన్ కారణంగా కస్టమర్ సర్వీస్ సెంటర్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్లు పనిచేయకపోవడం వల్ల సర్వీసులకు విఘాతం కలగవచ్చు. దీంతో ఆఫ్లైన్ విధానాల్లో ప్రీపెయిడ్ బ్యాలెన్స్లను టాప్ అప్ చేయించుకునేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి‘ అని ట్రాయ్ సూచించింది.