ఏపీకి కేంద్రం మరో శుభవార్త: పుట్టపర్తి – చిక్‌బళ్లాపూర్ కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి నుండి కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్ వరకు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు 713 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానత పెరగనుంది. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

ఈ కొత్త రైల్వే లైన్ పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుండి ప్రారంభమై కొత్తపల్లి, పెడబల్లి, గోరంట్ల, చిలమత్తూరు మీదుగా కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది. అక్కడ బాగేపల్లి, వర్లకొండ, దిబ్బూరు మీదుగా చిక్‌బళ్లాపూర్ వరకు సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం ఏడు కొత్త రైల్వే స్టేషన్లను నిర్మించనున్నారు (ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు, కర్ణాటకలో మూడు). ఇప్పటికే గుంతకల్లు డివిజన్ అధికారులు ఈ మార్గానికి సంబంధించిన సర్వేను పూర్తి చేసి, సమగ్ర నివేదికను సమర్పించడంతో కేంద్రం నిధుల మంజూరుకు పచ్చజెండా ఊపింది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పుట్టపర్తికి వచ్చే భక్తులకు రవాణా సౌకర్యాలు సులభతరం అవుతాయి. పర్యాటక రంగంతో పాటు స్థానిక వ్యాపార, వాణిజ్య రంగాలు పుంజుకుంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్‌తో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముదిగుబ్బ-పుట్టపర్తి, రాయచోటి-కదిరి వంటి ఇతర ప్రతిపాదిత లైన్ల పనులు కూడా వేగవంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *