తేది:1-02-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
హైదరాబాద్ : జయభేరి, గచ్చిబౌలి తెలుగు వెండితెరపై తనదైన చెరగని ముద్ర వేసి, దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు, మగధీరుడు మాగంటి మురళీమోహన్ కి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం వరించడం తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచింది. ఈ అరుదైన గౌరవం పట్ల సినీ పరిశ్రమతో పాటు సామాన్య ప్రజల నుంచి అభినందనల వెల్లువ కురుస్తోంది.
పద్మశ్రీ పురస్కారం అనేది కేవలం ఒక గుర్తింపే కాదు, కళారంగానికి ఆయన అందించిన అనిర్వచనీయ సేవలకు సమాజం ఇచ్చిన గౌరవప్రతీకం. జీవితంలో మధురానుభూతులకు ప్రతీకగా నిలిచే ఈ పురస్కారం, మురళీమోహన్ గారి సినీ ప్రస్థానానికి మరో మైలురాయిగా నిలిచింది.
తమ అభిమాన నటుడికి దక్కిన ఈ ఘన గౌరవాన్ని చూసి మురిసిపోయిన సాఫ్ట్వేర్ రంగానికి చెందిన కోమురవెల్లి శ్రీనివాస్, బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు గ్రహీత యలమంచిలి వరుణ్, అలాగే నళిని సినిమా దర్శకుడు డా. రంజిత్ కుమార్ మురళీమోహన్ ని ప్రత్యక్షంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శాలువాతో ఆత్మీయంగా సత్కరించి, పూలమాలలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా అభినందనలు తెలిపారు.
కళామతల్లి ముద్దుబిడ్డకు దక్కిన ఈ పద్మశ్రీ పురస్కారం అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపిందనడానికి, ఇలాంటి సామాన్యుల సన్మానమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.