
తేది:31-01-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
చర్లపల్లి–ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంఎటీఎస్ డౌన్ లైన్లో శనివారం తెల్లవారుజామున విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం సుమారు 2.30 గంటల సమయంలో చర్లపల్లి సెక్షన్ పరిధిలోని కిలోమీటర్ నంబర్ 206/48 వద్ద గూడ్స్ రైలు లోకో పైలట్ వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. రైల్వే పట్టాలపై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఐపీఎఫ్, చర్లపల్లి, ఏఎస్ఐపీఎఫ్ బిఎస్.రావు, జీఆర్పీ సిబ్బంది శ్రీ సాయి ఈశ్వర్ గౌడ్, మాదవ్ (ఎస్ఐ) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైల్వే పట్టాల మధ్యలో మూడు మృతదేహాలు తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. మృతులను బోడుప్పల్, హరితహరణం కాలనీకి చెందిన
పి. సురేందర్ రెడ్డి (40), పి. విజయ (38), పి. చేతన రెడ్డి
గా గుర్తించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల వద్ద ఎలాంటి రైల్వే ప్రయాణ టికెట్లు లేకపోవడంతో పాటు విలువైన వస్తువులు కూడా లభించలేదని జీఆర్పీ పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం ఆర్పీఎఫ్, జీఆర్పీ సంయుక్తంగా జాయింట్ ఆబ్జర్వేషన్ రిపోర్ట్ తయారు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జీఆర్పీ సికింద్రాబాద్ క్రైమ్ నంబర్ 57/2026 కింద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.