వందేమాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న-వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య.

తేది:07-01-2026 హనుమకొండ జిల్లా TSLAWNEWS హనుమకొండనియోజకవర్గం ఇంచార్జ్ దొమ్మటి పవన్ గౌడ్.

హనుమకొండ జిల్లా: హనుమకొండలోని పింగళి మహిళ డిగ్రీ కళాశాలలో భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) నిర్వహించిన వందేమాతరం 150వ వార్షికోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా సీబీసీ ఏర్పాటు చేసిన వందేమాతరం భారత రాజ్యాంగ చరిత్ర తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ ను ఎంపీ ప్రారంభించి సందర్శించారు.
ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే ఈ రోజు ప్రతి ఒక్కరికీ చదువుకునే హక్కు లభించిందని, ఈ గొప్ప అవకాశాన్ని దేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు. చదువే పేదరిక నిర్మూలనకు ప్రధాన ఆయుధమని, సమాన హక్కులు అందించే శక్తి ఒక్క చదువుకే ఉందని స్పష్టం చేశారు.
వందేమాతరం గీతం భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో ప్రజల్లో దేశభక్తిని రగిలించిన మహత్తర ప్రేరణగా నిలిచిందని తెలిపారు. దేశ స్వాతంత్ర్య సాధన కోసం అనేక మంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. యువత దేశ చరిత్రను తెలుసుకొని, దేశ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. భారతదేశం సర్వమత సమ్మేళనమని, మన దేశం సంస్కృతి–సాంప్రదాయాలకు నిలయమని పేర్కొన్నారు. సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి మహిళా నాయకుల సేవలను స్మరించుకుంటూ, ప్రతి విద్యార్థిని రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలను స్ఫూర్తిగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలు విద్యతో పాటు సామాజిక, రాజకీయ రంగాల్లో మరింత ముందుకు రావాలని అన్నారు. ప్రస్తుత విద్యార్థులే భవిష్యత్ ఇండియా అని పేర్కొన్న ఎంపీ, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు.
అలాగే సోషల్ మీడియ పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని, తమ భవిష్యత్ తమ చేతుల్లోనే ఉందని, చదువుపైనే పూర్తి నియంత్రణ ఉండాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవ వంటి అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనాలని, అప్పుడే దేశభక్తి, ఐక్యత, సమానత్వ విలువలతో కూడిన సమగ్ర ప్రతిభ వికసిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి బి సి అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, అధ్యాపకులు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *