
తేది: 05-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి సౌజన్యంతో పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన జిఎంఆర్ బ్రదర్స్ కుమార్ క్లాసిక్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 250 మందికి పైగా బాడీ బిల్డర్లు పాల్గొని తమ దేహదారుడ్యాలను ప్రదర్శించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన పోటీలు సోమవారం తెల్లవారుజాము రెండు గంటల వరకు హోరాహోరీగా కొనసాగాయి.
ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఓవరాల్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్గా ఓం ప్రకాష్, మెన్స్ ఫిజిక్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్గా షోయబ్ ఘన విజయం సాధించారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, రూ.50 వేల చొప్పున నగదు బహుమతులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి సోదరుడు, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి మరియు ఆయన కుమారుడు గూడెం విక్రమ్ రెడ్డిల చేతులమీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ గారు విజేతలను అభినందిస్తూ, యువత క్రీడల వైపు అడుగులు వేయడం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి పునాదిగా నిలుస్తుందని అన్నారు. ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ, పటాన్చెరులో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. క్రీడల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. క్రికెట్ వంటి క్రీడలతో పాటు బాడీ బిల్డింగ్పై కూడా యువతకు అవగాహన కల్పించేలా ఈ తరహా పోటీలు నిర్వహించడం ప్రశంసనీయమని తెలిపారు.
పోటీల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఓమర్, షకీల్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గుండమొల్ల రాజు, భూషణం, అక్బర్ పాషా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు లడ్డు, విజయ్లకు పలువురు అభినందనలు తెలిపారు.