సంస్కరణలే లక్ష్యం కావాలి: విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, విద్యారంగాన్ని ముందుకు నడిపించే నాయకులుగా మరియు సంస్కరణల రాయబారులుగా పనిచేయాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. అమరావతిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్టిఫికెట్లు ఉన్నా ఉద్యోగాలు లేక యువత ఎదుర్కొంటున్న గందరగోళాన్ని తాను పాదయాత్రలో స్వయంగా చూశానని, అందుకే విద్యాశాఖ బాధ్యతను ఒక సవాలుగా తీసుకున్నానని తెలిపారు. ఉన్నత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా సిలబస్: ప్రస్తుతం వర్సిటీల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న భారీ అంతరాన్ని లోకేశ్ ఎత్తిచూపారు. డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులు ఉద్యోగాల కోసం మళ్ళీ అమీర్పేటలో శిక్షణ పొందాల్సి రావడం మన విద్యాసంస్థల వైఫల్యమేనని ఆయన విశ్లేషించారు. స్టాన్ఫర్డ్ వంటి అంతర్జాతీయ వర్సిటీల తరహాలో పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఇంటర్న్షిప్లు మరియు ప్లేస్మెంట్లను తప్పనిసరి చేయాలని సూచించారు. రాబోయే పదేళ్లలో రానున్న ఉద్యోగాల్లో 80 శాతం కొత్త రంగాల్లోనే ఉంటాయని, అందుకు తగ్గట్టుగా విద్యార్థులను సిద్ధం చేయాలని వీసీలను కోరారు.
పరిశోధనలు సమాజానికి ఉపయోగపడాలి: విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు కేవలం పేపర్ పబ్లికేషన్లకే పరిమితం కాకుండా, సమాజం ఎదుర్కొంటున్న నీటి కొరత, వాతావరణ మార్పుల వంటి సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉండాలని లోకేశ్ దిశానిర్దేశం చేశారు. వీసీలు పరిపాలనా భారాన్ని తగ్గించుకుని అకడమిక్ ప్రమాణాలపై దృష్టి పెట్టాలని, విద్యార్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి వారం ‘ఓపెన్ హౌస్’ నిర్వహించాలని సూచించారు. వర్సిటీలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం తరహాలో పూర్వ విద్యార్థుల (Alumni) సహకారాన్ని తీసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.