నిందితుడికి దక్కని ఊరట: కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయంలో బంగారం మాయం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (TDB) మాజీ సభ్యుడు శంకర్దాస్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై కేరళ హైకోర్టు చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను తొలగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. దేవస్థానం బోర్డు సమావేశపు నివేదికలపై (Minutes) సంతకం చేసినందున, ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహించక తప్పదని జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది.
కోర్టు ఘాటు వ్యాఖ్యలు: ఈ సందర్భంగా సుప్రీంకోర్టు నిందితుల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. “మీకు దేవుడంటే లెక్క లేదు.. ఆయన్ని కూడా వదిలిపెట్టలేదు” అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే చట్ట ప్రకారం పరిశీలిస్తామని తెలిపిన కోర్టు, హైకోర్టు వ్యాఖ్యలపై అభ్యంతరాలు ఉంటే డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని సూచించింది. వ్యవస్థీకృత పద్ధతిలో ఆలయ బంగారం దొంగిలించడం వెనుక ఉన్న కుట్రపై న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవస్థీకృత చోరీగా గుర్తింపు: ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం (SIT) సంచలన విషయాలను బయటపెట్టింది. 1998లో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా విరాళంగా ఇచ్చిన సుమారు 30 కిలోల బంగారాన్ని విడతల వారీగా ఆలయ గోడల నుండి తొలగించినట్లు గుర్తించారు. ఈ బంగారాన్ని రహస్యంగా ప్రాసెసింగ్ కోసం చెన్నైకి తరలించినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటికే ఈ కేసులో టీడీబీ ఉన్నతాధికారులు, సభ్యులతో సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.