
తేది:05-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సోమవారం కొండగట్టు లోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ:
కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరిప్రదక్షిణ చేయడానికి కావాల్సిన ఏర్పాట్ల గురించి రెవిన్యూ, ఫారెస్ట్, ఆర్ & బి, పంచాయతీ రాజ్ మరియు సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు.
గిరిప్రదక్షిణ కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గ మధ్యలో భక్తులకు త్రాగునీరు, శౌచాలయాలు, విశ్రాంత కేంద్రాలు మరియు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందని తెలిపారు.
అలాగే గిరిప్రదక్షిణ కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అరుణాచలం, సింహాచలం తరహాలో గిరిప్రదక్షిణ ఏర్పాట్ల కు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
ఇందుకుగాను దాదాపు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు, విద్యుత్ దీపాలు, అటవీ శాఖ అనుమతుల గురించి మరియు పనుల అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు.
ఈ పరిశీలనలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) బి. రాజ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి మాదాసు రవి ప్రసాద్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, కొండగట్టు ఈ.వో శ్రీకాంత్ రావు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.