తెలంగాణలో ‘కోల్డ్ వేవ్’ తీవ్రత హెచ్చరిక: రాబోయే 10 రోజులు జాగ్రత్త

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన చలి తీవ్రత, రాబోయే పది రోజుల్లో (డిసెంబర్ 7 నుంచి 17 వరకు) మరింత విపరీతంగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ‘సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్’ పరిస్థితుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో ఇప్పటికే 10 నుంచి 13 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయే అవకాశం ఉంది. కొన్ని ఉత్తరాది జిల్లాల్లో అయితే 5 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, పెద్దపల్లి, మెదక్, కరీంనగర్, మంచిర్యాల వంటి ఇతర జిల్లాల్లోనూ చలి తీవ్రత గణనీయంగా పెరగనుంది.

రాజధాని హైదరాబాద్‌ నగరంలోనూ డిసెంబర్ 7 (ఆదివారం) నుంచి 10 రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. నగర పరిధిలో రాత్రి ఉష్ణోగ్రతలు 5 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చేవెళ్ల, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్ వంటి శివారు ప్రాంతాల్లో 5 నుంచి 8 డిగ్రీలు, అలాగే హెచ్‌సీయూ, శేరిలింగంపల్లి, నానకరామ్ గూడ వంటి ప్రాంతాల్లో 6 నుంచి 8 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. చలి ప్రభావం అధికంగా ఉన్నందున పొగమంచు కూడా విపరీతంగా ఉండే అవకాశం ఉందని, ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *