ధాన్యం రైతుల సమస్యల పరిష్కారానికి ‘1967’ హెల్ప్‌లైన్: మంత్రి నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను మరియు ‘1967’ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి కూటమి ప్రభుత్వం 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందుకుగాను రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు వివరించారు. ధాన్యం విక్రయ ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూసేందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చామన్నారు.

రైతులు తమ సమస్యలు (రిజిస్ట్రేషన్, టోకెన్ల జారీలో జాప్యం, తూకంలో సమస్యలు, గోనె సంచుల కొరత) ఏమున్నా 1967 నంబర్‌కు కాల్ చేయవచ్చని మంత్రి సూచించారు. ఈ హెల్ప్‌లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. వచ్చిన ప్రతి ఫిర్యాదును నమోదు చేసి, పరిష్కారం అయ్యేవరకు అధికారులు ఫాలోఅప్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *