మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ స్థానిక ఎన్నికల ర్యాలీలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంట్లో భర్తలు అవసరాలకు కనీసం రూ. వంద రూపాయలు కూడా ఇవ్వరని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ‘లక్కీ బహిన్’ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని ఆయన తెలిపారు.
డిసెంబరు 2న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో షోలాపూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల సమయంలో ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ప్రతి నెలా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే రూ.1,500 స్టైఫండ్ను గుర్తుంచుకోవాలని ఆయన మహిళా ఓటర్లను కోరారు. ఫడ్నవీస్ ప్రభుత్వం చేసిన ఈ సహాయాన్ని గుర్తుంచుకుని, ప్రతి మహిళ బీజేపీకి ఓటు వేసి విధేయత చూపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రక్షా బంధన్ సమయంలో కూడా సోదరులు తమ సోదరీమణులకు డబ్బు బహుమతిగా ఇచ్చేటప్పుడు వారి భార్యల అనుమతి తీసుకుంటారని మంత్రి గుర్తు చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గంలోని ‘మహాయుతి’ మిత్రులపై కూడా మంత్రి విమర్శలు చేశారు. పాలకవర్గంలోని కొన్ని పార్టీలు ఖజానా తమ దగ్గర ఉందని చెప్పుకుంటున్నప్పటికీ, తుది ఆమోదం మాత్రం బీజేపీదేనని పేర్కొన్నారు. అయితే భర్తలపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.