ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 77 అడుగుల ఎత్తున్న శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో నిర్మించారు. గుజరాత్ లో ఐక్యతా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ సుతార్ శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో రాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ, పర్తగలిలో ఉన్న మఠంలో ఉన్న ఆలయాన్ని కూడా సందర్శించారు.
శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠం గురించి..
శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠం దేశంలోని పురాతన సన్యాసుల సంస్థలలో ఒకటిగా కొనసాగుతోంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సహకారాలకు ప్రసిద్ధి చెందింది. సరస్వత్ సమాజంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. 550 సంవత్సరాలను మఠ సంప్రదాయాన్ని పురస్కరించుకుని నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 వరకు పలు కార్యక్రమాలను జరుపుతున్నారు. గోవాలోని మఠ ప్రాంగణాన్ని 370 సంవత్సరాల క్రితం కనకోనాలోని పార్తగల్ గ్రామంలో నిర్మించారు.
భారీగా తరలి వస్తున్న భక్తులు
ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా ప్రతి రోజూ7,000 నుంచి 10,000 మంది మఠ ప్రాంగణానికి వస్తున్నట్లు మఠాధికారులు వెల్లడించారు. ఇవాళ ఉదయం శ్రీ కృష్ణ మఠంలో లక్ష కంఠ గీత పారాయణ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ప్రధానమంత్రి కర్ణాటకలోని ఉడిపిలో రోడ్షో నిర్వహించారు. ఉడిపి పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి కృష్ణ మందిరం ముందు ఉన్న సువర్ణ తీర్థ మంటపాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణుడికి కనక కవచాన్ని అంకింతం చేశారు. దీని ద్వారా సాధువు కనకదాసు శ్రీకృష్ణుని దర్శనం పొందాడని నమ్ముతారు.
లక్ష కంఠ గీత పారాయణను ప్రశంసించిన ప్రధాని
కృష్ణ మందిర కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోడీ, ఉడిపిలో జనసంఘ్ సుపరిపాలన నమూనాను ప్రశంసించారు. శ్రీ కృష్ణ మఠంలో జరిగిన లక్ష కంఠ గీత పారాయణ కార్యక్రమంలో లక్ష మంది భక్తులతో కలిసి భగవత్ గీతలోని శ్లోకాలను పఠించిన తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సన్యాసులు, పండితులు, వివిధ రంగాలకు చెందిన పౌరులతో సహా లక్ష మందికి పైగా పాల్గొన్న వారితో కలిసి ప్రధాని మోడీ భగవత్ గీతను పఠించారు. ఈ సందర్భంగా ఉడిపిలో వి.ఎస్. ఆచార్య చేసిన కృషిని ప్రధానమంత్రి గుర్తు చేశారు. “ఉడిపికి రావడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఉడిపి జనసంఘ్, భారతీయ జనతా పార్టీ సుపరిపాలన నమూనాకు కర్మభూమి. 1968లో, ఉడిపి ప్రజలు జనసంఘ్ నుంచి వి.ఎస్. ఆచార్యను ఉడిపి మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నుకున్నారు. ఉడిపి కొత్త పాలన నమూనాకు పునాది వేసింది. నేడు మనం చూస్తున్న పరిశుభ్రత డ్రైవ్ను ఐదు దశాబ్దాల క్రితం ఉడిపి స్వీకరించింది. ఉడిపి 70లలో నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ నమూనాను అభివృద్ధి చేయడం ప్రారంభించింది” అన్నారు. భగవత్ గీత నుంచి లక్ష మంది శ్లోకాలను పారాయణం చేసినప్పుడు ప్రపంచం భారత దైవత్వాన్ని చూసిందని ప్రధాని మోడీ అన్నారు.