వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2026 జులై 23వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు సంబంధించిన నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు ఇప్పటికే వంద కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే, భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నందున, రైల్వే శాఖ రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు అదనంగా రూ. 271.43 కోట్లను కేటాయించింది. ఈ ఆధునికీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయి.
తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో పుణ్య స్నానాలు చేసేందుకు వీలుగా పుష్కర ఘాట్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి భారీగా నిధులు కేటాయించడం, ముందస్తుగానే పనులు ప్రారంభించడం వంటి చర్యలతో ఈసారి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి.