అమెరికా ఆంక్షల ప్రభావం: భారీ డిస్కౌంట్‌తో భారత్‌కు రష్యా చమురు

రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా ఆంక్షలు అమలులోకి రావడంతో, ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు రష్యా భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో ముడి చమురు విక్రయించేందుకు సిద్ధమైంది. రష్యా చమురు సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకోయిల్‌లపై నవంబర్ 21 నుంచి అమెరికా ఆంక్షలు విధించింది. దీని ఫలితంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. రష్యా నుంచి భారత్‌కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి.

రష్యా ప్రధాన చమురు అయిన ఉరల్స్‌ను, డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు కంటే బ్యారెల్‌కు ఏడు డాలర్ల వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించేందుకు రష్యా ముందుకు వచ్చింది. సాధారణంగా ఈ తగ్గింపు మూడు డాలర్లుగా ఉండేది. ఇప్పుడు ఆంక్షల కారణంగా ఇది రెండింతలు పెరిగింది. ఈ తగ్గింపు ధరతో వచ్చే చమురు డిసెంబర్ నెలలో లోడ్ అయి జనవరిలో భారత్‌కు చేరే అవకాశం ఉంది.

మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచే భారత్ తక్కువ ధరల కారణంగా రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. నవంబర్ 21 నుంచి ఆంక్షలు అమల్లోకి రావడంతో భారతీయ రిఫైనరీలు మొదట ఆర్డర్లను నిలిపివేసినా, ఈ వారంలో ఉరల్స్ చమురు ధర భారీగా తగ్గడంతో, ఆంక్షలు లేని సంస్థల నుంచి తిరిగి కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *