ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సులభతరం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. గతంలో మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇకపై ప్రజలు తమ ఇంటికి సమీపంలో ఉన్న సచివాలయాల్లోనే ఈ సేవలను పొందవచ్చు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించి, వాటి ప్రక్రియను చూసుకునే బాధ్యతను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి.

కొత్త రేషన్ కార్డుల జారీకి ఒక నిర్దిష్ట సమయపాలనను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. జనవరి నుంచి జూన్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి జులైలో కొత్త కార్డులు అందిస్తారు. అదే విధంగా, జులై నుంచి డిసెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా ప్రజలు సులభంగా తమకు కావలసిన రేషన్ కార్డును పొందవచ్చు.

ముఖ్యంగా, కొత్తగా పెళ్లయిన దంపతులు రేషన్ కార్డు పొందడం ఇప్పుడు చాలా సులభం. ఇందుకు వారికి ఆధార్ కార్డులు మరియు మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ‘మ్యారేజ్ స్ప్లిట్’ ఆప్షన్ ద్వారా వారి వివరాలు నమోదు చేసి, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. గతంలో మాదిరిగా మహిళను తల్లిదండ్రుల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ పూర్తయ్యే వరకు రేషన్ అందకపోయే సమస్య ఇప్పుడు లేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త దంపతులకు అత్తవారింట్లోనే రేషన్ అందజేస్తారు. అలాగే, రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చడానికి, అడ్రస్ మార్చుకోవడానికి కూడా పిల్లల ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్స్ తప్పనిసరి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *