జూబ్లీహిల్స్ ఫలితం రాష్ట్ర రాజకీయాలకు సంకేతం: కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫలితంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్‌ను మాత్రమే భావిస్తున్నారనేది ఈ ఎన్నికతో మరోసారి నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు.

కేటీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ, ఆమె శక్తివంచన లేకుండా పోరాటం చేసి, అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. ప్రచారం మొత్తం సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన మోసాన్ని ప్రజలకు వివరించామని, ఆ సందేశం మంచి స్థాయిలో ప్రజల్లోకి చేరిందని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల నిర్వహణపై కేటీఆర్ విమర్శలు చేశారు. అభ్యర్థి తమ్ముడికే మూడు సార్లు ఓట్లు ఉన్నాయని పేర్కొంటూ, ఇంతటి పోటీ ఉన్న ఎన్నిక ఎలా జరిగిందో అందరికీ స్పష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ప్రజల తీర్పును ఎప్పటికప్పుడు గౌరవిస్తామని, ఈ ఫలితంతో నిరాశ చెందాల్సిన అవసరం లేదని, బీఆర్‌ఎస్ మరింత బలంగా ముందుకు సాగుతుందని కేటీఆర్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *