ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ తన పొలం వద్ద కాపలా కాస్తున్న 70 ఏళ్ల రైతు కిట్టప్పపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల గుంపు అతనిని తొక్కి చంపడంతో కిట్టప్ప మరణించారు. ఉదయం చూసిన గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
గత కొద్ది రోజుల నుంచి ఏనుగులు గుంపులుగా వచ్చి పంట పొలాలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏనుగులు జరిపిన దాడిలో రైతు మరణించడం ఈ ప్రాంతంలో భయాందోళనలను మరింత పెంచింది. ఘటనాస్థలిని పరిశీలించిన అటవీ అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక రైతులు, తమ పొలాలను, తమ ప్రాణాలను రక్షించడానికి ఇకనైనా అధికారులు కుంకీ ఏనుగులతో వచ్చి తమ ప్రాంతంలో ఏనుగులను నియంత్రించాలని కోరుతున్నారు. రైతులు తమ పంటను కాపాడుకోవడానికి ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.