మలయాళ నటి గౌరీ కిషన్కు ఇటీవల ఓ సినిమా ప్రెస్ మీట్లో బాడీ షేమింగ్ అనుభవం ఎదురైంది. ఆమె బరువును ప్రస్తావిస్తూ రిపోర్టర్ ప్రశ్నించడంతో, గౌరీ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై సీనియర్ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ ఘాటుగా స్పందిస్తూ గౌరీకి మద్దతు తెలిపారు. జర్నలిస్టు తీరును తప్పుబడుతూ, ప్రస్తుత జర్నలిజం ప్రమాణాలు పడిపోయాయని కుష్బూ విమర్శించారు. “జర్నలిజం తన విలువను కోల్పోయింది. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. ఇలాంటి ప్రశ్నకు దీటుగా నిలబడిన యువ నటి గౌరీ కిషన్కు నా ధన్యవాదాలు” అంటూ ఆమె ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.
గౌరీ కిషన్, ఆదిత్య మాధవన్ జంటగా నటించిన సినిమా ప్రమోషన్లలో ఈ వివాదం చోటుచేసుకుంది. సినిమాలో హీరో హీరోయిన్ను ఎత్తుకునే సన్నివేశం గురించి ప్రస్తావిస్తూ, ఓ రిపోర్టర్ హీరోను ఉద్దేశించి “హీరోయిన్ను ఎత్తుకున్నప్పుడు బరువుగా అనిపించారా?” అని ప్రశ్నించారు. మరుసటి రోజు జరిగిన ప్రెస్ మీట్లో అదే రిపోర్టర్ మళ్లీ గౌరీ బరువు ప్రస్తావన తీసుకురావడంతో ఆమె సహనం కోల్పోయారు. “నా బరువు తెలుసుకుని మీరేం చేస్తారు? ఇది బాడీ షేమింగ్, ఒక స్త్రీని వస్తువుగా చూపిస్తున్నారు. ఇదే ప్రశ్న పురుష నటులను అడిగే ధైర్యం మీకు ఉందా?” అంటూ గౌరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు రిపోర్టర్లు ఆ ప్రశ్నను సరదాగా అడిగినట్లు చెప్పి విషయాన్ని తేలిక చేయడానికి ప్రయత్నించినా, గౌరీ అందుకు అంగీకరించలేదు. “నాకు అది సరదాగా అనిపించలేదు. బాడీ షేమింగ్ను సాధారణీకరించడం ఆపండి. ఆ ప్రశ్న నా గురించే కాబట్టి నా అభిప్రాయం చెప్పే హక్కు నాకుంది” అని ఆమె స్పష్టం చేశారు. గౌరీ కిషన్ వ్యవహరించిన ధైర్యవంతమైన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతుండగా, కొంతమంది జర్నలిస్టుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.