తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న “జాగృతి జనం బాట” కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ పర్యటనలో ఆమె ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను అన్వేషించారు. “సామాజిక తెలంగాణ సాధనమే మా లక్ష్యం” అని కవిత స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, “ప్రజల సమస్యలు మా అజెండా కంటే ముఖ్యమైనవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కరమయ్యాయి కానీ ఇంకా అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. అందుకే ఈ నాలుగు నెలలపాటు ప్రజల్లో తిరిగి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుంటాం” అని తెలిపారు.
కవిత ఈ పర్యటనలో ముఖ్యంగా పత్తి రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రైతులు మొంథా తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పత్తి రైతులకు తేమ శాతం ఆధారంగా తక్కువ ధర ఇవ్వడం అన్యాయమని పేర్కొంటూ, “రైతు యార్డ్కి పత్తి తీసుకురాగానే కాకుండా, అది ఆరిన తర్వాత తేమ శాతం చూసి కొనాలి” అని డిమాండ్ చేశారు. అలాగే, చనాఖా-కొరటా, కుప్తి ప్రాజెక్టుల పూర్తిలో ఆలస్యం జరుగుతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, ఈ ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని డిమాండ్ చేశారు.
జైనత్ దేవాలయం అభివృద్ధి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అంశాలపై కూడా కవిత స్పందించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ కాలేజీలు బంద్ చేయాల్సిన పరిస్థితి రావడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో ప్రజలతో కలిసి తిరిగి కనీసం నాలుగు ప్రధాన సమస్యలైనా పరిష్కారం చేయగలిగితే తమ జీవితం ధన్యమవుతుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. “సామాజిక తెలంగాణ కోసం జాగృతి పునరుద్ధరణ ప్రారంభమైంది” అని ఆమె స్పష్టం చేశారు.