ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో భాగంగా కీలక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన లండన్లోని అతిపెద్ద విద్యుత్ సరఫరా సంస్థ అయిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్ గెరాల్డ్ను సీఎం ఆహ్వానించారు.
గ్రీన్ ఎనర్జీ లక్ష్యం, స్మార్ట్ గ్రిడ్లపై చర్చ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, రాష్ట్రంలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులకు వివరించారు. ముఖ్యంగా అమరావతి, విశాఖపట్నం వంటి నగరాల్లో స్మార్ట్ గ్రిడ్, డేటా అనలిటిక్స్ వంటి నూతన టెక్నాలజీ ద్వారా విద్యుత్ సరఫరా మరియు నియంత్రణ రంగంలో కలిసి పనిచేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
పెట్టుబడులకు అనుకూల వాతావరణం
క్లీన్ ఎనర్జీ, స్మార్ట్ గ్రిడ్ వంటి ఆధునిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు, లక్ష్యాలను ఆయన వివరించారు. రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆక్టోపస్ ఎనర్జీ ప్రతినిధులను కోరారు.