కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, వైసీపీ అధికారిక ఎక్స్ (X) ఖాతా నిర్వాహకులు, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణ వంటి వారి పేర్లు ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని బెల్టు షాపులు, కల్తీ మద్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందంటూ వైసీపీ చేసిన ప్రచారమే ఈ కేసు నమోదుకు ప్రధాన కారణమైంది.
కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య ఫిర్యాదు ఆధారంగా కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులు ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించారు. దర్యాప్తులో, ప్రమాదానికి అసలు కారణం మద్యం మత్తులో శివశంకర్ అనే వ్యక్తి నడిపిన బైక్ డివైడర్ను ఢీకొట్టడమేనని తేలింది. బైక్పై ఉన్న అతని స్నేహితుడు ఎర్రి స్వామి వాంగ్మూలం ప్రకారం, ప్రమాదం తర్వాత రోడ్డుపై ఉన్న బైక్ను బస్సు వేగంగా ఢీకొని ఈడ్చుకెళ్లడం వల్లే మంటలు చెలరేగాయి.
శివశంకర్ మద్యం సేవించినట్లు, ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు పెట్రోల్ కొట్టించినట్లుగా ఉన్న సీసీ ఫుటేజ్ను కూడా పోలీసులు విడుదల చేసి తమ దర్యాప్తు వాస్తవాలను సమర్థించారు. పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు ఇలా ఉండగా, దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ, కల్తీ మద్యానికి ముడిపెట్టి ప్రచారం చేశారన్న ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామల, తదితర వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ కేసు సంచలనంగా మారింది.