ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో, అయ్యర్కు ఎడమ పక్కటెముకల వద్ద బలంగా తగిలి అంతర్గత గాయమైంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్కు చేరుకున్న ఆయన, కొద్ది సేపటికే స్పృహతప్పి పడిపోవడంతో, వెంటనే జట్టు వైద్య సిబ్బంది స్పందించి సిడ్నీలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చి, వైద్య పర్యవేక్షణలో ఉంచారు.
తరువాత నిర్వహించిన స్కానింగ్ పరీక్షల్లో అయ్యర్ ప్లీహానికి (Spleen) గాయం అయినట్లు నిర్ధారణ అయింది. బీసీసీఐ (BCCI) విడుదల చేసిన ప్రకటనలో, “శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకల కింద గాయపడ్డాడు. స్కానింగ్లో ప్లీహానికి గాయం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు” అని తెలిపింది. బీసీసీఐ వైద్య బృందం, సిడ్నీ మరియు భారత వైద్య నిపుణులతో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా గమనిస్తోంది. టీమిండియా వైద్యుడు కూడా అయ్యర్తో పాటు సిడ్నీలోనే ఉండి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
వైద్యుల సూచనల ప్రకారం, అంతర్గత రక్తస్రావం కారణంగా అయ్యర్ కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. మొదట మూడు వారాల్లో కోలుకుంటారని భావించినా, అంతర్గత గాయం వల్ల ఆ వ్యవధి పెరిగే అవకాశం ఉంది. కనీసం వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారణ అయినప్పుడే అయ్యర్ను భారత్కు తిరిగి పంపే అవకాశం ఉంది.