వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత: అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర (14,234 పరుగులు) రికార్డును అధిగమించి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నాడు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 74 పరుగులు చేసి, తన వన్డే కెరీర్‌లో 75వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి కోహ్లీకి కేవలం 293 ఇన్నింగ్స్‌లు మాత్రమే పట్టింది. ఈ జాబితాలోని టాప్ 10 ఆటగాళ్లలో ఎవరికీ లేనంత అద్భుతమైన పరుగుల సగటు (57.69) కోహ్లీ సొంతం కావడం విశేషం.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, రోహిత్ శర్మ సెంచరీ (121 నాటౌట్)తో చెలరేగగా, కోహ్లీ అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *