అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో మార్పులు: కొత్త సమయాలు నేటి నుంచి అమలు

దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక మార్పులు చేసింది. శీతాకాలం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు అసౌకర్యం కలగకుండా, స్వామివారి సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఆలయ దర్శన సమయ వ్యవధిని గంట మేర తగ్గించినట్లు ట్రస్ట్ ప్రకటించింది. నూతనంగా సవరించిన ఈ వేళలు గురువారం, అంటే అక్టోబర్ 23వ తేదీ నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. భక్తులు ఈ కొత్త సమయాలను దృష్టిలో ఉంచుకుని తమ అయోధ్య యాత్రను ప్లాన్ చేసుకోవాలని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం, రోజులో మొదటి ఆరాధన అయిన మంగళ హారతిని తెల్లవారుజామున 4 గంటలకే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇచ్చే శృంగార హారతి 6.30 గంటలకు ఉంటుంది. గతంలో ఉదయం 6.30 గంటలకు తెరిచే దర్శనం, కొత్త షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. భోగ హారతిని మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించి, నైవేద్యం నివేదిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు.

మధ్యాహ్నం ఒంటి గంటకు దర్శనాన్ని తిరిగి ప్రారంభిస్తారు. అలాగే దర్శనానికి చివరి అనుమతిని రాత్రి 9.30 గంటల వరకు ఇస్తారు, అంటే ఆ సమయానికి ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి లభిస్తుంది. రోజులో చివరి ఆరాధన అయిన శయన హారతిని కూడా రాత్రి 9.30 గంటలకు నిర్వహిస్తారు. ప్రవేశానికి సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు చేశారు; బిర్లా ధర్మశాల ముందు ఉన్న గేటు వద్ద ఉదయం 8.30 గంటలకే భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తారు. అలాగే ఉదయం 9 గంటల తర్వాత సెక్యూరిటీ గేట్ డీ1 నుంచి కూడా ఆలయంలోకి అనుమతి ఇవ్వబడదని ట్రస్ట్ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *