తన కూతురిని దూరం చేశాడని కోపం: అల్లుడిని కిడ్నాప్ చేసి చితకబాదిన అత్త

తన కుమార్తెను తన నుంచి దూరం చేశాడన్న కోపంతో, గుంటూరు జిల్లాలో ఒక అత్త తన అల్లుడిని కిడ్నాప్ చేసి, కిరాయి వ్యక్తుల చేత చితకబాదిన ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠ పౌరోహిత్యం చేస్తుంటాడు. మణికంఠ 2021వ సంవత్సరంలో వినుకొండకు చెందిన ఒక యువతిని వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లయిన తర్వాత మణికంఠ అతని భార్య అత్తవారింటికి వెళ్లడం లేదు, అత్త వ్యవహారం నచ్చక వారు ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు.

దీనిపై కోపం పెంచుకున్న అత్త విజయలక్ష్మి, తన కుమార్తెను తనకు దూరం చేశాడన్న కక్షతో అల్లుడిని కిడ్నాప్ చేయాలని పథకం వేసింది. దీనికోసం ఆమె వినుకొండకు చెందిన వేణుగోపాల్, గుంటూరుకు చెందిన కిరణ్, తెనాలికి చెందిన యశ్వంత్ వర్థన్, పిడుగురాళ్లకు చెందిన కోటేశ్వరరావులతో కలిసి శనివారం రాత్రి తెనాలిలోని మణికంఠ ఇంటికి వచ్చింది. మాట్లాడాలని చెప్పి మణికంఠను కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీంతో మణికంఠ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మణికంఠ ఫోన్ నెంబరు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా, చేబ్రోలు మండలం శేకూరు మార్గంలో మణికంఠను కారు నుంచి దించి చితకబాదుతుండగా పోలీసులు వెళ్లి రక్షించారు. పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కేసులో ఉన్న యశ్వంత్ వర్థన్ ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడని, మిగిలిన ముగ్గురిపై రౌడీషీట్లు ఉన్నాయని తెనాలి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *