ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు, పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా, సీఎం చంద్రబాబు నవంబర్ 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో లండన్లోని పలువురు పారిశ్రామిక వేత్తలతో ఆయన భేటీ అయి, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
లండన్ పర్యటనకు ముందు, అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్, అబుదాబి, యూఏఈల్లో కూడా పర్యటించనున్నారు. ఈ విదేశీ పర్యటనల వెనుక ప్రధాన ఉద్దేశం.. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సుకు అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించడం. ఈ పర్యటనలో రియల్ ఎస్టేట్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ వంటి రంగాల్లో పెట్టుబడిదారులను చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించనున్నారు.
ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డితో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాతో కూడిన అధికారుల బృందం వెళ్లనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా.. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే సింగపూర్, దావోస్లో పర్యటించి పెట్టుబడులను ఆకర్షించింది. విశాఖ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులను ఆహ్వానించే ప్రయత్నంలో భాగంగానే ఈ విదేశీ పర్యటనలు కొనసాగుతున్నాయి.