నల్గొండ లిల్లీపుట్‌ను ఓడిస్తాం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వాఖ్యలు..

బీఆర్ఎస్ పార్టీ రాజకీయ భవిష్యత్తుపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నాలుగు ముక్కలైందని, అది మునిగిపోయిన పడవ అని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో నల్గొండ ‘లిల్లీపుట్‌’ను కూడా ఓడించి తీరుతామని అన్నారు.

 

నల్గొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని పూర్తిగా అయిపోయిందని, దాని గురించి ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని అన్నారు.

 

ఈ సందర్భంగా నల్గొండ నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన పలు హామీలు ఇచ్చారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరిస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని దిశానిర్దేశం చేశారు.

 

నల్గొండ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూటికి నూరు శాతం మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *