సుగాలి ప్రీతి కేసులో కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే సీబీఐకి అధికారికంగా లేఖ రాయనుంది.

 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కేసుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన సీఐడీ ఉన్నతాధికారులతో సమావేశమై కేసు పురోగతిపై ఆరా తీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పవన్ కల్యాణ్ ఈ కేసుకు సంబంధించి గళం విప్పుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన కర్నూలు వెళ్లి సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించి, వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

 

ఆనాడు పవన్ కల్యాణ్ ఒత్తిడితో గత వైసీపీ ప్రభుత్వం కేసు విచారణలో కొంత కదలిక తీసుకువచ్చినప్పటికీ, అప్పటికే కీలకమైన సాక్ష్యాధారాలు లేకుండా పోయాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కేసును నిష్పక్షపాతంగా విచారించాలంటే సీబీఐ జోక్యం అవసరమని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఎల్లుండి జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించి, అధికారికంగా ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రివర్గ ఆమోదం తర్వాత, కేసును సీబీఐకి బదిలీ చేసే ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *