సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న…

బీసీ రిజర్వేషన్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని ప్రధానమంత్రి మోదీ వద్దకు ఎందుకు తీసుకువెళ్లలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేస్తున్న కవిత నిన్న తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, ఇతర బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

 

కాంగ్రెస్ పార్టీ బీసీలను వంచించాలని చూస్తోందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కలిసి వచ్చే అన్ని వర్గాలతో ముందుకెళ్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా బీసీలను వంచించాలని చూస్తోందని ఆరోపించారు.

 

రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యాకే బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం అంటే బీసీ రిజర్వేషన్లు ఇప్పటికైతే అమలు చేయమని చెప్పడమేనని అన్నారు. ఇదే విషయం అసెంబ్లీ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

 

బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను వంచించాలని చూస్తున్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజల ముందు ఎండగడతామని అన్నారు. పార్టీపరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కంటి తుడుపు చర్యనేనని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *