యువత వారానికి ఒక్కసారైనా చేనేత వస్త్రాలు ధరించాలి: పవన్ కల్యాణ్..

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేత కార్మికులకు శుభవార్త చెప్పింది. చేనేత రంగానికి అండగా నిలుస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇందులో భాగంగా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.

 

గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ స్పందిస్తూ, చేనేత కళ మన దేశ సంస్కృతికి, స్వాతంత్ర్య స్ఫూర్తికి ప్రతీక అని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో చేనేత రంగానికి లబ్ధి చేకూర్చేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఉచిత విద్యుత్ పథకంతో పాటు, చేనేత సొసైటీల నుంచి ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలపై 5 శాతం జీఎస్టీ రాయితీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. దీనితో పాటు, కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

 

కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి అన్ని విధాలుగా ఊతమిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని అన్నారు. రాష్ట్రంలోని యువత వారానికి ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరిస్తే, ఆ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అసంఘటిత రంగాలలో కీలకమైన చేనేతను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *