ఏపీలో మామిడి రైతులకు బిగ్ రిలీఫ్. తోతాపురి మామిడికి మార్కెట్ ధరను నిర్ణయించింది కేంద్రం. క్వింటాకు మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను రూ.1,490గా నిర్ణయించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో డబ్బులు చెల్లించనున్నాయి.
వాటిని సంబంధించిన నిధులను నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేయనుంది. మామిడి విషయంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమంత్రి మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్రం నిర్ణయంతో మామిడి ధరల పడిపోకుండా రైతులకు మేలు కలిగింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనోపాధిని మెరుగుపరుస్తుందన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు చేస్తున్న కృషిని కేంద్రమంత్రి పెమ్మసాని అభినందించారు.
తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఏపీ ప్రభుత్వం గత వారం మామిడి రైతుల అకౌంట్లలో రూ.260 కోట్లు జమ చేసింది. మరో రూ.150 కోట్లు వారి ఖాతాలో పడనున్నాయి. తోతాపురి మామిడి రైతులకు ఈసారి కాలం కలిసి వచ్చిందన చెప్పాలి.
ఆ సమస్యను పరిష్కరించిన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. కృష్ణా తర్వాత చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు అధికంగా సాగులో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో లక్ష ఎకరాల్లో మామిడి తోటలను సాగు చేస్తున్నారు రైతులు.
ఏటా ఐదు లక్షల టన్నుల దిగుబడి వస్తోందని ఆ జిల్లా వ్యవశాయ శాఖ అధికారుల మాట. 39 వేల హెక్టార్లలో తోతాపురితోపాటు నీలం, అల్పోన్సో, బేనీషా, మల్లిక రకానికి చెందిన మామిడి తోటలు సాగు అవుతున్నాయి. బంగారుపాళెంలో 4 వేలు, పులిచెర్ల- 3,668 హెక్టార్లు, ఐరాల వద్ద 3,366 హెక్టార్లు, సోమల మండలంలో 2340 హెక్టార్ల విస్తీర్ణంలో మామిడిని సాగు చేస్తున్నారు రైతులు.
తవణంపల్లి-2,773 హెక్టార్లు, వడమాలపేట-2,264 హెక్టార్లు, పూతలపట్టు-1,738 హెక్టార్లు, సదుం- 2,881, చిన్నగొట్టిగల్లు-2321 హెక్టార్ల మామిడిని సాగులో ఉంది. పల్ప్ పరిశ్రమకు అవసరమైన తోతాపురి మామిడిని అధికంగా సాగు చేస్తారు ఆ ప్రాంత రైతులు.