మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసు… మాజీ ఆర్డీవో అరెస్ట్..

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఫైల్స్ దగ్ధం కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ అధికారులు అరెస్టు చేసి, వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు.

 

పూర్తి వివరాల్లోకి వెళితే, ఫైళ్ల దగ్ధం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఆర్డీవో, ఆ సంఘటన జరిగినప్పటి నుండి అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. పరారీలో ఉన్న మురళిని పట్టుకునేందుకు సీఐడీ అధికారులు మదనపల్లె, తిరుపతి, హైదరాబాద్‌లలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

 

చివరకు ఆయన తిరుపతిలోని కేఆర్ నగర్‌లో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. అయితే, ఆర్డీవో మురళి ముందస్తు బెయిల్ కోసం తొలుత హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం దానిని తిరస్కరించింది.

 

దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు, అరెస్టు అనంతరం బెయిల్ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు ఆయనను అరెస్టు చేసి, ఆ వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *