గుజరాత్‌లో ఘోర విషాదం..! వడోదర బ్రిడ్జి కూలిన ఘటనలో 9 మంది జలసమాధి..

గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదర, ఆనంద్ జిల్లాలను కలిపే గంభీర నదిపై ఉన్న పురాతన వంతెన బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన సమయంలో వంతెనపై నుంచి వెళుతున్న ఐదు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురిని సహాయక బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి.

 

ప్రమాద విషయం తెలియగానే అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే, ఈ వంతెనకు గతేడాది మాత్రమే మరమ్మతులు చేపట్టడం గమనార్హం. అంతేకాకుండా, దీనిపై ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి మూడు నెలల క్రితమే రూ. 212 కోట్ల వ్యయంతో కొత్త వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కొత్త వంతెన కోసం డిజైన్, టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన తరుణంలో ఈ దుర్ఘటన జరగడం విషాదాన్ని నింపింది.

 

ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి చీఫ్ ఇంజనీర్, బ్రిడ్జ్ డిజైన్ బృందంతో పాటు నిపుణులను పంపించారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పాత వంతెన మరమ్మతులపై, దాని నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *