రేవంత్ రెడ్డి సీఎం కావడం వల్లే ఈ దారుణాలు బయటకు వచ్చాయి: షర్మిల..

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిందని ఆమె అన్నారు. ఒకవేళ గత ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, ఈ విషయం బయటకు వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

 

కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడలేదని షర్మిల స్పష్టం చేశారు. గతంలో తన ఫోన్‌ను కూడా ట్యాప్ చేసి, ఆ ఆడియోను తనకే వినిపించారని ఆమె ఆరోపించారు. ఆ సమయంలో ఒకవైపు జగన్, మరోవైపు కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నందున తాను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని తెలిపారు.

 

అప్పటికే తనను రాజకీయంగా అణచివేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, పోలీసు వ్యవస్థ మొత్తం వారి చేతుల్లోనే ఉండటం వల్ల తాను ఫోన్ ట్యాపింగ్‌పై పోరాటం చేసినా రెండు రాష్ట్రాల్లో కూడా దర్యాప్తు జరిగేది కాదని షర్మిల పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *