అత్యంత వేగవంతమైన ఇంటర్‌నెట్‌ అందించేందుకు రూ.5వేల కోట్లతో తెలంగాణ ఫైబర్‌

డిజిటల్‌ తెలంగాణలో భాగంగా.. అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు 83 లక్షల కుటుంబాలకు అత్యంత వేగవంతమైన ఇంటర్‌నెట్‌ అందించేందుకు రూ.5వేల కోట్లతో తెలంగాణ ఫైబర్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నాం. ఇది పూర్తయితే డిజిటల్‌ అక్షరాస్యత లో రాష్ట్రం దేశంలోనే ముందుంటుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు వసా ్తయి”… 2015లో ఈ ప్రాజెక్టు ప్రారంభంలో ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌ రావు చెప్పిన మాటలివి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని, మూడేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కేటీఆర్‌ కూడా అప్పటి నుంచి చెబుతూవస్తున్నారు. చెప్పిన గడువు పూర్తయి మరో మూడేళ్లు గడిచాయి. ప్రాజెక్టు పరిస్థితి మాతరం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది. ఆరేళ్లలో 10శాతం పనులు మాత్రమే జరిగాయంటే.. మొత్తం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏమిటీ టీ-ఫైబర్‌..?

టీ-ఫైబర్‌ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ప్రకటించింది. గ్రామ, మండలస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని గ్రామ పంచాయతీలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 83.58 లక్షల గృహాలకు చౌకగా, వేగవంతమైన ఇంటర్‌నెట్‌ అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని గ్రామాలకు ఇంటర్‌నెట్‌ అందించాలన్న లక్ష్యంతో ‘భారత్‌ నెట్‌’ పథకాన్ని అమలుచేస్తుండటంతో.. టీ-ఫైబర్‌ ప్రాజెక్టుకు కేంద్రం నిధు లు కూడా అందుతున్నాయి. భారత్‌ నెట్‌ రెండోదశలో భాగంగా కేంద్రం 2017 ఆఖర్లోనే రాష్ట్రానికి రూ. 1,243 కోట్లు కేటాయించింది. నిఽధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. ప్రాజెక్టు ఇది నత్తనడకన సాగుతోంది.

పూర్తయింది 10శాతం పనులే..

మిషన్‌ భగీరథ ప్రాజెక్టులో భాగంగా వేస్తున్న పైప్‌లైన్‌తోపాటే ఫైబర్‌ లైన్‌ కూడా వేస్తున్నారు. ఈ ప్రా జెక్టు పూర్తి కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా 98వేల కిలోమీటర్లకు పైగా తవ్వకాలు జరపాలని 2016లో నిర్ణయించారు. అయితే జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల సంఖ్య పెరగటంతో… 33 జిల్లాలు, 584 మండలాలు, 10,128 గ్రామ పంచాయతీల పరిధిలో లక్ష కి లోమీటర్లకు పైగా తవ్వకాలు జరగాల్సి ఉంది. కానీ.. ఇంతవరకు మూడోవంతు తవ్వకాలు కూడా పూర్తవలేదు. జూన్‌ 2018 నాటికి టీ-ఫైబర్‌ ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2017లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తర్వాత ఈ లక్ష్యాన్ని ఏటా పొడిగించుకుంటూ పోతున్నారు తప్ప పనుల్లో పురోగతి లేదు. దీనిపై గతేడాది జూన్‌ 17న సుదీర్ఘంగా సమీక్షించిన మంత్రి కేటీఆర్‌ 10నెలల్లో పనులన్నీ పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ గడువు కూడా ఏప్రిల్‌ 2021తో పూర్తయింది. కానీ 10శాతం గ్రామపంచాయతీల పరిధిలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. ఇక్క డా ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి వచ్చేందుకు మరో రెండు నెలలు పట్టనుంది.

ప్రత్యేక సంస్థ ఏర్పాటైనా.. నత్తనడకే

ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని భావించి టీ-ఫైబర్‌ను ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా రాష్ట్ర ప్రభు త్వం మార్చింది.అయినా పనుల్లో పురోగతి లేదు. కేబుల్‌ లైన్లు వేయడం సాధ్యంకాని మావోయిస్టు ప్రభావిత ప్రాం తాల్లో మొబైల్‌ టవర్లను ఏర్పాటుచేయాలని కేం ద్రం నిర్ణయించింది. దీనికనుగుణంగా రాష్ట్రంలో ఉమ్మ డి అదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల పరిధిలోని 184 ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటుచేయాలని భావించా రు. ఇప్పటివరకు ఈ పనులు 51 ప్రాంతాల్లో మాత్రమే పూర్తయ్యాయి. అదిలాబాద్‌ జిల్లాలో 25 చోట్ల టవర్లు ప్రతిపాదించగా ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏర్పాటుచేయలేదు. కరీంనగర్‌లో 11కుగాను ఒక్కటే ఏర్పాటైంది. ఖమ్మంలో 148 టవర్లను ఏర్పాటుచేయాల్సి ఉండగా.. 50 చోట్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి.

పూర్తయితే.. కీలక మార్పులకు దోహదం

టీ-ఫైబర్‌తో రాష్ట్రంలో అనేక రంగాల్లో కీలక సంస్కరణలు సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం, బ్యాంకింగ్‌ రంగాల్లో భారీ మార్పులకు అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఈ-విద్య : అక్షరాస్యతలో జాతీయసగటుతో పోలిస్తే రాష్ట్రం వెనుకబడి ఉంది. ముఖ్యంగా గ్రామీణ బాలికల్లో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. టీ-ఫైబర్‌తో ఈ-విద్య ద్వారా అందరికీ విద్యను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ-వైద్యం: వైద్యం కోసం నగరాలు, పట్టణాలకు వెళ్లాల్సిరావడం, అత్యవసర సమయాల్లో వైద్యం అందుబాటులో లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో ప్రధాన సమస్య. ఈ ప్రాజెక్టు ద్వారా నగరాల్లోని ప్రముఖ వైద్యులతో టెలీమెడిసిన్‌ సేవలు అందించాలని ప్రభుత్వ ఆలోచన.

ఈ-వ్యవసాయం: వ్యవసాయ రంగంలో వస్తోన్న అత్యాధునిక మార్పులను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేయడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ-బ్యాంకింగ్‌: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు ఖాతాదారులు పెరుగుతున్నా.. బ్యాంకు శాఖలు లేకపోవడం పెద్ద సమస్య. దీంతో ప్రజలకు సమయం, డబ్బులు వృధా అవుతున్నాయి. టీ-ఫైబర్‌తో ఇంటివద్దకే బ్యాంకింగ్‌ సేవలను తేవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.

ఆగస్టులోగా మరో 10శాతం పంచాయతీలకు..

నిధులు విడుదల చేయడంలో కేంద్రం జాప్యం చేస్తుండటంతో టీ-ఫైబర్‌ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. గతంలో పేర్కొన్న లక్ష్యం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాటికి ప్రాజెక్టు పూర్తవ్వాలి. అన్ని గ్రామపంచాయతీలకు వేగవంతమైన ఇంటర్‌నెట్‌ అందించాలి. ఇప్పటికి 10శాతానికి పైగా గ్రామపంచాయతీల్లో పనులన్నీ పూర్తయ్యాయి. కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. ఆగస్టు నాటికి మరో 10శాతం గ్రామ పంచాయతీల్లో పనులు పూర్తిచేసి ఇంటర్‌నెట్‌ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా పనులు పూర్తిచేయడంలో జాప్యం జరుగుతోంది.

– సుజయ్‌ కారంపురి, డైరెక్టర్‌, టీ-ఫైబర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *