ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు..! వెలుగులోకి కృష్ణమోహన్‌రెడ్డి లీలలు..!

ఏపీ లిక్కర్ కుంభకోణంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డి లీలలు బయటకు వస్తున్నాయి. ఆయన కర్నూలు ఎమ్మార్వోగా ఉన్నప్పుడు నటి మోనికాబేడీ(సనా మాలిక్ కమల్)కి తప్పుడు రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇచ్చినట్టు ఓ వార్త బయటకు వచ్చింది. ఈ వ్యవహారం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

 

లిక్కర్ కుంభకోణంలో కొత్త విషయాలు

 

లిక్కర్ స్కామ్‌లో నిందితుల లీలలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ కేసు విచారిస్తున్న సిట్‌ అధికారులు లభించిన ఆధారాలతో షాకవుతున్నారు. ఇదే క్రమంలో మాఫియా డాన్‌ అబూసలేం ప్రియురాలు నటి మోనికాబేడి ఫేక్ పాస్‌పోర్టు జారీ చేసిన వ్యవహారం బయటకు వచ్చింది.

 

ఆ సమయంలో కర్నూలు తహసీల్దార్‌గా ఉన్నారు కృష్ణమోహన్‌రెడ్డి. సనా మాలిక్‌ కమల్‌ అలియాస్ నటి మోనికాబేడీకి 2001 ఏప్రిల్‌ 9న రెసిడెన్సీ సర్టిఫికెట్ ఆయన జారీచేశారు. కర్నూలులో బాబూ గౌండ వీధిలో ఉన్నట్లు తప్పుడు సర్టిఫికెట్‌ ఇచ్చారు. సర్టిఫికెట్‌ను అడ్డు పెట్టుకుని మోనికాబేడీ పాస్‌పోర్టు సంపాదించింది.

 

ఇంతకీ మోనికాబేడి వ్యవహారం ఏంటి?

 

1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటన పాత్రధారి, మాఫియా‌డాన్ అబూ సలేంతో కలిసి విదేశాలకు పారిపోయింది మోనికాబేడి. 2002లో పోర్చుగల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ తర్వాత తీగ లాగితే డొంక అంతా కదిలింది. కర్నూలు కేంద్రంగా నకిలీ పాస్‌పోర్టుల తయారీకి కేరాఫ్‌గా మారిందని తేలింది. ఆ కేసులో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

సీబీఐ రంగంలోకి దిగి అప్పటి తహసీల్దార్ కృష్ణమోహన్‌రెడ్డిని విచారించింది. ఆర్‌ఐ మహ్మద్‌ యూనిస్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా రెసిడెన్సీ సర్టిఫికెట్ జారీ చేశానంటూ ఆ కేసు నుంచి తప్పించుకుని చివరకు సాక్షిగా మారారు. మోనికాబేడి నకిలీ పాస్‌పోర్టు వ్యవహారంలో కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు ఐపీఎస్ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు.

 

క్షేత్ర స్థాయిలో తనిఖీ ఆధారంగా సనా మాలిక్‌ కమల్‌‌కు పాస్‌పోర్టు జారీకి ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వెంటనే అక్కడి నుంచి ఆంజనేయులను తొలగించారు. ఆయన స్థానంలోకి సంజయ్ వచ్చారు. 2002లో నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారం అప్పుడు వెలుగుచూసింది.

 

ఆనాడు మోనికాబేడీకి పాస్‌పోర్టు విషయంలో తప్పించుకున్న ఆంజనేయులు, కృష్ణమోహన్‌రెడ్డిలు ప్రస్తుతం వివిధ కేసుల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం జైలులో ఉంటున్నారు. కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టయిన నేపథ్యంలో 2002లో జరిగిన పాస్‌పోర్టుల వ్యవహారం మరోసారి చర్చ అయ్యింది.

 

ఇక పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం జైలులో గడుపుతున్నారు. అప్పటి ఐపీఎస్ అధికారి సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ హోదాల్లో ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *