సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..! “అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీ..

తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని అన్నారు. మేడే సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

 

” కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకం. తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిది. తెలంగాణలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే మీ సహకారం ఎంతో ఉంది” అని సీఎం రేవంత్ తెలిపారు.

 

సింగరేణి లాభాలలో కార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని.. గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని.. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్మికులకు మేలు చేయడమే తమ ప్రభుత్వ విధానం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 

“అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నాం. గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు. ఆర్టీసీలో సమ్మెపై చర్చలు జరుగుతున్నాయంటున్నారు. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా.. సమ్మె ఆలోచన వీడండి. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉంది. గత పదేళ్లలో విధ్వంసం జరిగింది. గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారు. 1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారు. సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా. మేం అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో 8 లక్షల 29 వేల కోట్లు మా చేతికి అప్పు పెట్టి వెళ్లారు. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్లకే కూలింది. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగింది” అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

 

ఈ 15 నెలలు నేను, నా సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని.. ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండని తెలిపారు. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండని అన్నారు. అణా పైసా కూడా తాను ఇంటికి తీసుకెళ్లేది లేదని. మీ కోసమే ఖర్చు చేస్తామని అన్నారు.

 

“రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. అందుకే ఒకసారి ఆలోచించండి. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుంది. ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుంది. పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వాళ్ల వలలో పడొద్దు. వారి విషపు చూపుల్లో చిక్కుకోవద్దు. కేసీఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. అసెంబ్లీకి మీరు పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండి. కపట నాటక సూత్రధారి మళ్లీ బయలుదేరిండు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఆర్టీసీ కార్మికులు నన్ను నమ్మండి. నమ్ముకున్న మీకు అండగా ఉంటా. త్వరలో రాష్ట్రంలో గిగ్ వర్కర్స్ పాలసీ తీసుకురాబోతున్నాం. ఇది దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతోంది. తెలంగాణ రైజింగ్ ను ఎవరూ ఆపలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *