తెలంగాణ-ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ ఎంతవరకు వచ్చింది? ఆ ప్రాంతంలో కీలక మావోయిస్టులు ఉన్నారా? ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కేసీఆర్ ఎందుకన్నారు? తనపై ఉన్న అపవాదు పొగొట్టుకునేందుకు ఆయన ఈ స్కెచ్ వేశారా? తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్రెడ్డి భేటీ వెనుక అసలేం జరుగుతోంది? ఇదే చర్చ తెలంగాణ అంతటా నెలకొంది.
తెలంగాణ-ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో వారం రోజులుగా మావోయిస్టుల కోసం ఆపరేషన్ కగార్ చేపట్టింది కేంద్రం. ఈ ఆపరేషన్లో పదుల సంఖ్యలో మావోలు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. పౌర సంఘాల హక్కుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఎలాగైనా ఆపరేషన్కు ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామన్నారు సీఎం రేవంత్రెడ్డి.
ఆదివారం వరంగల్లో జరిగిన రజతోత్సవ సభలో ఆపరేషన్ కగారు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు మాజీ సీఎం కేసీఆర్. ఈ ఆపరేషన్ కేంద్రం నిలిపి వేయాలని పిలుపునిచ్చారు. బలం ఉందని చంపడం సరికాదని, మావోలతో చర్చలు జరపాలని అన్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డితో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అందులో గుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చించినట్టు సమాచారం. గతంలో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మావోలతో శాంతి చర్చలు జరిగిన విషయం తెల్సిందే. అప్పట్లో జానారెడ్డి కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి సలహాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.