పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా దాయాది పాకిస్థాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే దేశంలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించడంతో పాటు సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన కేంద్రం.. తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్ను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు ‘పర్సోనా నాన్ గ్రాటా’ అధికారిక నోటీసులు అందజేసింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు ఈ నోటీసులు జారీ చేస్తారు. దీనిప్రకారం వారు వారం రోజుల్లోగా భారత్ను వీడాల్సి ఉంటుంది. ఈమేరకు విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.