మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డికి సిట్ నాలుగోసారి నోటీసులు..

మద్యం కుంభకోణం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇదివరకే సిట్ ఆయనకు మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసులు పంపింది.

 

ఈ కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ నగరంతో పాటు పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన పెట్టుబడులకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఆయన పెట్టుబడులు పెట్టిన సినీ పరిశ్రమకు చెందిన వారిని కూడా సిట్ అధికారులు విచారించనున్నట్లు సమాచారం.

 

కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు సినిమాల నిర్మాణం చేపట్టినట్లు దర్యాప్తులో సిట్ అధికారులు గుర్తించారు. చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారని వెల్లడైంది. 2023 జూన్ 29న విడుదలైన ఈ సినిమాకు కథను కూడా తానే సమకూర్చినట్లు టైటిల్స్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాణానికి అయిన వ్యయం ఎంత, నిధులు ఎక్కడి నుంచి సేకరించారు, ఏయే రూపాల్లో చెల్లింపులు జరిపారనే అంశాలపై సిట్ ఇదివరకే వివరాలు సేకరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *