వక్ఫ్ చట్ట సవరణపై ఏపీలో భగ్గుమన్న నిరసనలు… పలు జిల్లాల్లో ముస్లింల ఆందోళన..

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకత తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు విస్తరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముస్లిం సంఘాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి, బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.

 

కడప జిల్లా వేంపల్లిలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసి) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. స్థానిక మర్కస్ మసీదు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో పాల్గొన్నవారు, వక్ఫ్ సవరణ బిల్లును ‘నల్ల చట్టం’గా పేర్కొంటూ దాన్ని రద్దు చేయాలని, మత సామరస్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. ఇదే తరహాలో విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద కూడా ముస్లిం సంఘాల ప్రతినిధులు నల్ల వస్త్రాలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

 

నెల్లూరు నగరంలోనూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా వేలాది మంది ముస్లింలు షాజీ మంజిల్ నుంచి గాంధీ సర్కిల్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, తమ పూర్వీకులు దానం చేసిన ఆస్తులతో సహా వక్ఫ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకుని, వాటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తీవ్రంగా ఆరోపించారు. వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్రం ఈ చట్ట సవరణను పునఃపరిశీలించి, వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.

 

దేశవ్యాప్తంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వక్ఫ్ సవరణ బిల్లుపై ఇప్పటికే తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా కూడా జరిగింది. గత కొద్ది రోజులుగా కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఇది ముస్లింల ఆస్తులను హరించే కుట్ర అని విమర్శిస్తున్నారు. అయితే, వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడానికే ఈ సవరణలు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి విరుద్ధంగా, ఈ సవరణలు వక్ఫ్ బోర్డుల స్వయంప్రతిపత్తికి, మత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని నిరసనకారులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కొనసాగిస్తామని ముస్లిం సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని వారు తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *