మమతకు షాక్..! 25 వేల టీచర్ల నియామకాలు చెల్లవన్న సుప్రీంకోర్టు..

పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన టీచర్ల నియామక కుంభకోణం కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ కేసులో దాఖలైన పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. అవకతవకలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 25,753 టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

 

ఆ నియామకాలను రద్దు చేస్తూ గతంలో కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సీజేఐ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సమర్థించింది. ఆ పోస్టులకు సంబంధించి చేపట్టిన నియామక ప్రక్రియ మలినపడిందని సుప్రీం ధర్మాసనం ఆక్షేపించింది. అయితే, నియామకాలు రద్దయిన ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు ఇప్పటి వరకు అందుకున్న జీతభత్యాలను వెనక్కి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

 

అంతేగాక మానవీయ కోణంలో ఆలోచించి ఆ నియామకాల ద్వారా ఉద్యోగాలు సాధించిన దివ్యాంగులు యథావిథిగా తమ ఉద్యోగాలు చేసుకోచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక, మూడు నెలల్లోగా కొత్త నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేయాలని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

కాగా, అంతకుముందు ఈ టీచర్ల నియామక కుంభకోణంపై గత ఏప్రిల్‌లో కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2016 నాటి స్టేట్ లెవల్ సెలక్షన్ టెస్ట్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామక ప్రక్రియ చెల్లదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ పరీక్షతో జరిపిన నియామాలను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. అంతేగాక, దీనికి కింద ఉద్యోగాలు సాధించిన ఉాపాధ్యాయులు తమ వేతనాన్ని తిరిగి ఇచ్చేయాలని పేర్కొంది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

 

ఈ నేపథ్యంలోనే వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీజేఐ బెంచ.. ఫిబ్రవరి 10న తీర్పును రిజర్వ్‌లో తాజాగా గురువారం వెలువరించింది. మరోవైపు, టచర్ల నియామక కుంభకోణంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని గతంలోనే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ పై ఏప్రిల్ 4న విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

 

సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించమంటూ మమతా బెనర్జీ

ప్రభుత్వ పాఠశాలల్లో 25,000 మంది ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేయడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

“న్యాయవ్యవస్థ పట్ల అత్యున్నత గౌరవం ఉంది కానీ తీర్పును అంగీకరించలేను” అని మమతా బెనర్జీ అన్నారు. ఎంపీ వ్యాపం కుంభకోణంతో పోల్చి చూస్తూ, “పశ్చిమ బెంగాల్ మాజీ విద్యా మంత్రి జైలులో ఉన్నారు, ఎంపీ వ్యాపం కేసులో ఎంతమంది బీజేపీ నాయకులను అరెస్టు చేశారు?” అని ఆమె ప్రశ్నించారు. “బెంగాల్ విద్యా వ్యవస్థ పతనాన్ని నిర్ధారించాలని బీజేపీ కోరుకుంటుందా?” అని బెనర్జీ మరింత నిలదీశారు. ఈ తీర్పుతో ప్రభావితమైన వారికి హామీ ఇస్తూ, “ఉద్యోగాలు కోల్పోయిన వారిని కలుస్తాను, ఆశను కోల్పోవద్దని వారిని అడుగుతాను” అని మమతా బెనర్జీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *