కర్ణాటకలో హనీ ట్రాప్ దుమారం.. అసెంబ్లీ నుంచి 18 మంది బిజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..

కర్ణాటకలో హనీ ట్రాప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ‘హనీ ట్రాప్’ (Honey Trap) వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు సహా అనేకమంది ప్రముఖ నేతలు ఉండడంతో అక్కడ ప్రతిపక్ష నాయకులు దీనిపై కేంద్ర విచారణ సంస్థల ద్వారా దర్యాప్తు చేయించాలని పట్టుబడుతున్నారు. జాతీయ స్థాయి నేతలు సహా 48 మంది రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్నారని ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై శుక్రవారం కర్ణాటక అసెంబ్లీ (Karnataka Assembly)లో దుమారం రేగింది. సమావేశాల సమయంలో ప్రతిపక్ష బిజేపీ నేతలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.

 

హనీ ట్రాప్ విచారణను పక్కనపెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడాన్ని విమర్శిస్తూ, బిజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ చుట్టూ చేరి నినాదాలతో నిరసన తెలిపారు. దీంతో సభా కార్యక్రమాలకు అడ్డుపడిన 18 మంది బిజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ (BJP MLAs suspended) విధించే తీర్మానం చేయబడింది. ఫలితంగా ఆరు నెలల పాటు వారిపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

 

సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం.. ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాల్, లాబీ, గ్యాలరీలోకి ప్రవేశించకూడదు. వారు ఏ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో వారి పేర్లతో ఎలాంటి అంశం లిస్ట్ కాకూడదు. ఈ కాలంలో వారికి రోజువారీ భత్యాలు కూడా అందకుండా చేయబడ్డాయి. సస్పెండ్ చేయబడిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా అసెంబ్లీ నుంచి బయటకు తరలించారు.

 

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం

బిజేపీ నేతల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే, హనీ ట్రాప్‌లో ఎవరి ప్రమేయం ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని, చట్టప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి జి. పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ.. అసెంబ్లీలో బిజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. దీంతో 15 నిమిషాల పాటు సభ వాయిదా పడింది.

 

హనీ ట్రాప్‌లో అన్ని పార్టీల నాయకులు

రాష్ట్రానికి చెందిన అనేకమంది రాజకీయ నేతలు హనీ ట్రాప్‌లో చిక్కుకుపోయారని కర్ణాటక సహకార శాఖ మంత్రి కేఎన్‌ రాజన్న ఇటీవల అసెంబ్లీలో పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు కనీసం 48 మంది ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీడీలు, పెన్‌డ్రైవ్‌లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇది ఏ ఒక్క పార్టీకి పరిమితమైన విషయం కాదని, అధికారపక్షం సహా విపక్షానికి చెందినవారు ఈ బాధితుల్లో ఉన్నారని ఆయన వివరించారు. అంతకుముందు ఇదే అంశంపై మంత్రి సతీశ్‌ జార్కిహోళీ మాట్లాడుతూ, ఒక మంత్రిపై రెండుసార్లు హనీ ట్రాప్‌ యత్నం జరిగిన విషయం వాస్తవమేనని పేర్కొన్నారు. అయితే, ఇది రాష్ట్రానికి కొత్త కాదని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *