ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం.. కాకినాడ దశ తిరుగుతోందా..?

ఏపీ కేబినెట్ సమావేశం శుక్రవారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర శాఖల మంత్రులు హాజరయ్యారు. కేబినెట్ సమావేశంలో 14 అంశాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

 

ఏపీ కేబినెట్ సమావేశంలో 14 అజెండాలకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం, పర్యాటక శాఖ పరిధిలోని పలు పెండింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా కాకినాడ లో టూరిజం అభివృద్ధికి సుమారు 115 ఎకరాల కేటాయింపుకు కేబినెట్ ఆమోదించింది. కుప్పంలో డిజిటల్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించింది. అలాగే రాజమండ్రిలో వ్యవసాయ కళాశాలకు భూమి కేటాయింపు, పార్వతీపురం మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు, ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్లు 2025 కు ఆమోదం లభించింది. ప్రధానంగా రాష్ట్రంలో పౌర సేవలను నేరుగా అందించేందుకు సవరణ చట్టాన్ని కేబినెట్ ఆమోదించినట్లు సమాచారం.

 

మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ

ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులు విజయాన్ని సాధించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అలాగే త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక గురించి కొద్దిసేపు మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అలాగే తాజా రాజకీయ పరిస్థితుల గురించి పూర్తిస్థాయిలో మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.

 

రేపు మార్కాపురం రానున్న సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రేపు ప్రకాశం జిల్లా మార్కాపురం రానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 1000 మంది మహిళా రైడర్లకు ఉపాధి కల్పించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రాక సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ల అధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించగా, బందోబస్తు తీరును ఎస్పీ దామోదర్ పరిశీలించారు.

 

ఉదయం 10.45 గంటలకు సీఎం మార్కాపురంకు చేరుకుంటారు. ఆ తర్వాత 4.30 గంటల వరకు మార్కాపురం పర్యటనలో సీఎం ఉండనున్నారు. అయితే మార్కాపురం జిల్లాకు సంబంధించి సీఎం కీలక ప్రకటన చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. పశ్చిమ ప్రకాశం జలప్రసాదిని వెలుగొండ ప్రాజెక్ట్ గురించి సీఎం కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రకాశం జిల్లా పర్యటనకు సీఎం వస్తున్న సంధర్భంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *