తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పాతబస్తీ వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి . ఎక్కడి ప్రజలు అక్కడే ఇళ్లకు పరిమితమయ్యారు. బయటికి వెళ్లకుండా కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా మార్చడంతో జనసంచారం తగ్గింది. ప్రధాన రహదారులతో పాటు గల్లీలన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొన్నటిదాకా ప్రజల సంచారం ఎక్కువగా కనిపించింది. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ జనాలతో కొన్ని కొన్ని వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ చారి్మనార్ జోన్ పరిధిలోని 6, 7, 8 సర్కిళ్ల పరిధిలో ప్రత్యేక కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసిన అధికారులు.. శనివారం 9,10 సర్కిళ్లల్లోనూ కొత్తగా కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. బారికేడ్ల వద్ద నోడల్ అధికారులను నియమించారు. ఫోన్ సమాచారం ద్వారా నిత్యావసరాలను అందజేస్తున్నారు. బస్తీవాసులు బయటికి రాకుండా.. బయటివాళ్లు లోనికి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బారికేడ్ల వద్ద ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.